ఫాక్షన్కు దూరం, ప్రశాంతజీవనం: సూరి
అనంతపురం/ విజయనగరం: తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరుపతయ్య హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి స్పష్టం చేశారు. తిరుపతయ్య హత్యతో సూరికి సంబంధం ఉందని తెలుగుదేశం పెనుకొండ శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆరోపించిన విషయం తెలిసిందే. పరిటాల రవి హత్యలో సూరితో పాటు మరో 11 మందిని బుధవారం అనంతపురం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా సూరి ఒక లేఖను కింద జారవిడిచారు. తన నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన హాని లేదని ఆయన అన్నారు. ఫాక్షన్కు దూరంగా జరిగి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
పరిటాల రవి హత్య కేసులోని నిందితుల రిమాండ్ను ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిటాల హత్య కేసు నుంచి జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను పేరును విడగొట్టడానికి కోర్టు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే రవి హత్య కేసులో నిందితుడైన రామ్మోహన్ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టలేదు. దీంతో మొద్దు శ్రీను పేరును కేసు నుంచి విడగొట్టే విషయాన్ని కోర్టు వాయిదా వేసుకుంది. రామ్మోహన్ రెడ్డిని ప్రవేశపెట్టకపోవడంపై కోర్టు జైలు అధికారులపై మండిపడింది.
ఇదిలావుంటే, మొద్దు శ్రీనును పట్టుకోవడానికి మీడియా సహకరించాలని హోం మంత్రి కె. జానారెడ్డి విజయనగరంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇంటర్వ్యూ చేసినవారు మొద్దు శ్రీను సమాచారం అందించకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా నేరస్థుల సమాచారం పోలీసులకు అందించాల్సి ఉందని ఆయన అన్నారు. పరిటాల హత్య కేసు ప్రభుత్వానికే కాకుండా మీడియాకు, ప్రజానీకానికి కూడా ప్రతిష్ఠాకరమైందని ఆయన అన్నారు.