హైదరాబాద్కు చేరిన డియస్సీ అభ్యర్థుల ఆకలిబాట
హైదరాబాద్: 1998 డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆకలిబాట ఆదివారంనాడు హైదరాబాద్కు చేరుకుంది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 1998 డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఆకలిబాటను ప్రారంభించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రతి యాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతో వైయస్ బాటలను గుర్తు చేస్తూ డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు చేవెళ్ల నుంచి తమ ఆకలిబాటను ప్రారంభించారు.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఇందిరా పార్కు వద్ద సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమకు ఉద్యోగాలు ఇచ్చే వరకు ఈ దీక్షలు సాగిస్తామని, అవసరమైతే ఆత్మాహుతి చేసుకుంటామని వారు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ శాసనసభ నుంచి వాకౌట్ చేసిందని, తాము అధికారంలోకి రాగానే తమకు ఉద్యోగాలు ఇస్తామని రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. దసరా కానుకగా, దీపావళి కానుకగా తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి రాజ్యలక్ష్మి చెబుతూ వచ్చారని, అయితే ఒక అధికారి మాట విని తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారన్నారు.