మాపై కుట్రలకు వైయస్, జానాలదే బాధ్యత: కళ్యాణ్
హైదరాబాద్: తమను చంపడానికి జరుగుతున్న కుట్రలకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి బాధ్యత వహించాలని విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు జి. కళ్యాణ్రావు అన్నారు. ప్రజా సంఘాల నాయకులను చంపడానికి జరుగుతున్న కుట్రలకు వారు బాధ్యత వహించడమే కాకుండా సమాధానం చెప్పాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీసులకు తెలియకుండా ఈ కుట్రలు జరగబోవని ఆయన అన్నారు. మాజీ నక్సలైట్ నయామ్ ముఠా జి. కళ్యాణ్రావు, వరవరరావు, లక్ష్మణ్లను చంపడానికి ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో కళ్యాణరావు తీవ్రంగా ప్రతిస్పందించారు.
ఎవరికేమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని విరసం నాయకుడు వరవరరావు అన్నారు. విరసం అధ్యక్షుడు కళ్యాణ్రావుకు, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్కు ఏం జరిగినా, ఎవరికేమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తాము ఈ విషయాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి దృష్టికి తెచ్చామని, వాటిని వారు ఊహాగానాల కింద కొట్టేశారని అంటూ ఇప్పుడేమంటారని ఆయన అడిగారు.