610జీవోపై వైయస్ ఒప్పంద ఉల్లంఘన: నరేంద్ర
హైదరాబాద్: ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి విడుదలైన 610 జీవో అమలు విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ ఒప్పందాన్ని ఉల్లంఘించారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. ఢిల్లీలో తమ నేత కె. చంద్రశేఖర్రావుతో 610 జీవో అమలుపై చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని వైయస్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని ఆయన అన్నారు. 610 జీవోను అమలు చేయాలని కోరడానికి ఆయన ఆదివారం ముఖ్యమంత్రిని కలిశారు.
పులిచింతల ప్రాజెక్టు పనులను ఆపేస్తామని రాజశేఖర్ రెడ్డి హామీ ఏదీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. తమకు పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయని ఆయన చెప్పారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలను వైయస్ ఉల్లంఘించారని నరేంద్ర ఇంతకు ముందు విమర్శించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకుపోతామని ఆయన చెప్పారు. తాను ఒప్పందాలను ఉల్లంఘించలేదని నరేంద్ర విమర్శకు ప్రతిస్పందనగా ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రత్యేక తెలంగాణకు ఒప్పుకుంటేనే భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకుంటామని నరేంద్ర మెదక్లో అన్నారు. సొంత పార్టీలోనే ఠికానా లేని బిజెపి నాయకుడు సిహెచ్. విద్యాసాగరరావా మాట్లాడేదని ఆయన ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇంజనీర్లు చెప్పిన ప్రకారం నిర్మించాలని తాను ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిని కోరినట్లు, అందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ఆయన తెలిపారు.