11 మంది నక్సల్స్ లొంగుబాటు, ఒకరి అరెస్టు
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఒక నక్సలైట్ను పోలీసులు అరెస్టు చేశారు. జనశక్తి, ప్రతిఘటన, న్యూడెమొక్రసీలకు చెందిన 11 మంది నక్సలైట్లు వరంగల్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) స్టీఫెన్ రవీంద్ర ముందు ఆదివారంనాడు లొంగిపోయారు. వీరలక్ష్మి అలియాస్ సంగీత అనే మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. లొంగిపోయినవారిలో జనశక్తికి చెందిన రవీందర్, ఆయన భార్య రజిత, రఘు, ముక్కాల లింగమూర్తి, న్యూడెమొక్రసీకి చెందిన నాగరాజు, లలిత, ప్రతిఘటనకు చెందిన రాములు ఉన్నారు. వీరిపై పది కేసులున్నాయని యస్పీ చెప్పారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా మేడిపల్లి గ్రామంలో సలీమా అనే మహిళను నక్సలైట్లు కొట్టి చంపారు. గత రాత్రి ఎనిమిది మంది సాయుధ నక్సలైట్లు వచ్చిన సలీమాను తీవ్రంగా కొట్టారు. దాంతో ఆమె మరణించింది. పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తోందనే నెపంతో ఆమెను నక్సలైట్లు హత్య చేశారు. నక్సలైట్ల చర్యను యస్పీ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. మహిళలను చంపి తమ ఉనికిని ప్రకటించుకోవాలని అనుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.