చర్చలకు ఆయుధాలు షరతు: కెకె, కాకూడదు: వివి
హైదరాబాద్: ఆయుధాలు వీడితేనే నక్సలైట్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. నక్సల్స్ ఆయుధాలు వీడాలనే షరతు అప్పుడు లేదు, ఇప్పుడు ఉండకూడదని మావోయిస్టుల మాజీ ప్రతినిధి వరవరరావు అన్నారు. పియుసియల్ ఆదివారం ఏర్పాటు చేసిన చర్చావేదిక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశవరావుకు, వరవరరావుకు మధ్య స్వల్పంగా వాగ్వివివాదం జరిగింది. నక్సలైట్లతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని, అయితే దానికి ఎజెండా ఉండాలని, ఆ ఎజెండా నక్సలైట్లు ఆయుధాలు వీడే అంశం కావాలని కేశవరావు అన్నారు. శాశ్వత శాంతి స్థాపనకు కాకుండా ఏ విషయం మీద చర్చ జరిగినా వ్యర్థమేనని ఆయన అన్నారు.
నక్సలైట్లతో చర్చలు జరగాలంటే ప్రభుత్వమే ముందు 3 నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలని, దాన్ని నక్సలైట్లు అంగీకరించి వారు కూడా కాల్పుల విరమణను పాటిస్తారని వరవరరావు అన్నారు. నిరుడు జూన్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించాలని ఆయన అన్నారు. గత చర్చల సందర్భంలో నక్సలైట్లు ఆయుధాలు వీడాలనే షరతు లేదని, గ్రామాల్లో తుపాకులతో తిరగకూడదనే ఒప్పందం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. తెలుగుదేశం విధానానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగానూ భిన్నంగా లేదని ఆయన విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ ఎజెండా తప్ప ప్రభుత్వానికి ఏ విధమైన విజన్ లేదని ఆయన అన్నారు. రెండు వైపులా హింస తగ్గితేనే చర్చలకు అవకాశం ఉంటుందని పౌర హక్కుల నేతలు అన్నారు.