రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం: సియం
హైదరాబాద్: రాష్ట్రాభివృద్ధికి త్రిముఖ వ్యూహం అనుసరించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. గ్రామీణాభివృద్ధికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐటి)కి ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. రైతులు తమ స్వేదంతో మన కడుపులు నింపుతున్నారని, వారు బాగు పడిందేమీ లేదని ఆయన అన్నారు. రైతుల శ్రమకు తగిన ఫలితం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నదీజలాలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకుంటామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పథకాలు వేగవంతంగా పూర్తయి వాటి ఫలితాలు ప్రజలకు అందేలా చూస్తామని ఆయన అన్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు వైద్యం చేయించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.