ధనిక భారతాన్ని నిర్మిస్తాం: మన్మోహన్
న్యూఢిల్లీ: తీవ్రవాద చర్యలను పాకిస్థాన్ పూర్తిగా నిర్మూలించాలని, తీవ్రవాద నిరోధక చర్యలను అరకొరగా చేపడితే సరిపోదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తీవ్రవాదం పెరగడానికి వెనుబాటు తనమే కారణమని ఆయన అన్నారు. వచ్చే పదేళ్లలో ఆరోగ్యకరమైన ధనిక భారతదేశాన్ని నిర్మిస్తామని ఆయన అన్నారు. ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో తామకు తారకమంత్రమని ఆయన అన్నారు.
కాశ్మీర్లో హింస కొనసాగితే సహించబోమని ఆయన అన్నారు. కాశ్మీర్లో హింసను రూపుమాపడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శాంతి, అభివృద్ధి వైపు కాశ్మీర్ పయనిస్తోందని ఆయన అన్నారు. కాశ్మీర్ ప్రజలకు తీవ్రవాదులు మిత్రులు కారని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యలు తీర్చడానికి తాము ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.
వెనకబాటుతనాన్ని రూపుమాపడానికి తగిన ఉద్యోగాలను కల్పిస్తామని, జాతీయ గ్రామీణ ఉద్యోగ కల్పనా గ్యారంటీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. నిరుపేతల కనీసావసరాలు తీరితే సంపూర్ణ స్వాతంత్య్రం సాధించినవారం అవుతామని ఆయన అన్నారు.
ప్రతి గ్రామంలో 2007నాటికి కృషి విజ్ఞాన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నేషనల్ రెయిన్ఫెడ్ ఏరియా అథారిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగాల కల్పనకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులను పింఛన్లు ఇస్తామని ఆయన చెప్పారు.