నక్సల్స్పై మీడియా పోరు: వైయస్ సలహా
నారాయణపేట: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మరోసారి సోమవారం మీడియాపై విరుచుకుపడ్డారు. నక్సల్స్ను మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేయడంపై ఆయన రుసరుసలాడారు. ఇంటర్వ్యూ చేసే మీడియా ప్రతినిధులు నక్సల్స్ సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన నారాయణపేటలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. శాసనసభ్యుడు నర్సిరెడ్డి భౌతికకాయంతో పాటు ఇతర మృతుల భౌతికకాయాలు ఉన్న నారాయణపేట ఆస్పత్రిని ఆయన సందర్శించారు.
నక్సల్స్ రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని, వారిపై పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై, ముఖ్యంగా మీడియాపై ఉందని ఆయన అన్నారు. దొంగచాటుగా దెబ్బ తీయడమే నక్సల్స్కు ఉన్న వరమని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును ఇంటర్వ్యూ చేసిన మీడియా ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండిందని ఆయన అన్నారు.
నక్సలైట్లు హత్యాకాండతో సాధించేదేమీ లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. సమస్యలుంటే ప్రభుత్వ దృష్టికి తేవాలని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డితో పాటు కేశవరావు, కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి నారాయణపేట ఆస్పత్రికి వచ్చారు. అనంతరం వారు సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ కూడా సంఘటనా స్థలానికి బయలుదేరారు.