సూపర్ సిరీస్కు సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో తలపడే రెస్టాఫ్ ద వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత్కు చెందిన సచిన్ టెండూల్కర్కు, వీరేంద్ర సెహ్వాగ్కు, రాహుల్ ద్రావిడ్కు స్థానం దక్కింది. వన్డే, టెస్టు జట్టులు రెండింటిలో టెండూల్కర్కు, సెహ్వాగ్కు స్థానం దక్కగా, టెస్టు జట్టులో మాత్రమే ద్రావిడ్కు స్థానం లభించింది. టెస్టు జట్టుకు ద్రావిడ్ వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. టెండూల్కర్ వన్డే జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. మెల్బోర్న్, సిడ్నీలలో ఈ జానీవాకర్ సూపర్ సిరీస్ అక్టోబర్లో జరుగుతుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీకి ఏ జట్టులోనూ స్థానం దక్కలేదు. న్యూజిలాండ్కు చెందిన ఐసిసి వరల్డ్ ఎలెవన్ సెలెక్టర్ రిచర్డ్ హాడ్లీ ఈ విషయాన్ని మంగళవారంనాడు ప్రకటించారు.
దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్ టెస్టు జట్టుకు, షాన్ పొలాక్ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తారు. వరల్డ్ ఎలెవన్తో తలపడడం ఆస్ట్రేలియాకు అంత సులభమేమీ కాదని సెలెక్షన్ ప్యానెల్ సమావేశానికి అధ్యక్షత వహించిన సునీల్ గవాస్కర్ అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టు ఆస్ట్రేలియాను ఒత్తిడికి గురి చేయగలదని ఆయన అన్నారు. సూపర్ సిరీస్ రెండు జట్లకు కూడా సవాలేనని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పొంటింగ్ అన్నారు.
టెస్టు, వన్డే జట్టుల్లో దక్షిణాప్రికాకు చెందినవారు ఆరుగురు, ఇంగ్లాండు, భారత్లకు చెందినవారు ముగ్గురేసి, శ్రీలంక, పాకిస్థాన్లకు చెందినవారు ఇద్దరేసి, వెస్టిండీస్, న్యూజిలాండ్లకు చెందినవారు ఒక్కరేసి ఉన్నారు. ఆస్ట్రేలియాతో తలపడిన సందర్భంలో ప్రదర్శించిన ఆటతీరును బట్టి క్రీడాకారులను ఎంపిక చేశారు.