పిపిఎలను రద్దు చేయాలి: వామపక్షాల డిమాండ్
హైదరాబాద్: విద్యుత్ కంపెనీలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలను) రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఐదేళ్ల క్రితం విద్యుత్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లో జరిగిన ప్రదర్శన సందర్భంగా పోలీసులు కాల్పుల్లో మరణించివవారి సంస్మరణార్థం ఆదివారం సభ నిర్వహించాయి. ఈ సభలో సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి. వి. రాఘవులు, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్ నారాయణ ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంక్ విధానాలనే అవలంబిస్తోందని వారు విమర్శించారు. విద్యుత్ చట్టాన్ని శాసనసభలో సవరించి, విద్యుత్ కంపెనీలతో జరిగిన అన్ని ఒప్పందాలను సమీక్షించాలని రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిపిఎల రద్దు విషయంలో తమ చేతుల్లో ఏదీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే లాభం లేదని నారాయణ అన్నారు. వ్యవసాయం, సాగునీటి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.
అమరవీరుల సంస్మరణార్థం వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఆదివారంనాడు రక్తదాన శిబిరం నిర్వహించారు. అమరవీరులకు వారు నివాళులు అర్పించారు.