మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సర్దుబాట్లే: వైయస్
హైదరాబాద్: వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్), మజ్లీస్లతో కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సర్దుబాట్లు ఉంటాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఒక సూత్రప్రాయమైన అంగీకారానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆదివారంనాడు జరిగిన ఒక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఠాలను పక్కన పెట్టి వివాదరహితులకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఆయన పార్టీకి సూచించారు. గత శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో శాసనసభ్యులను, లోక్సభ సభ్యులను గెలిపించిన కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.
వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై వచ్చే నెల 3,4 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో వివరిస్తూ ఎన్నికల ప్రణాళికలు విడుదల చేయాలని ఆయన అన్నారు. తెలుగుదేశం, బిజెపిల విమర్శలను పత్రికాముఖంగా తిప్పికొట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.