ఏడాదిలోగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్: బైజాల్
హైదరాబాద్: ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ప్రదీప్ బైజాల్ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ గ్రామంలో నెట్వర్క్ కార్యక్రమాన్ని ఆయన సోమవారంనాడు పరిశీలించారు. మూడో దశలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో లక్ష కిలోమీటర్లు ఆప్టిక్ కేబుల్ వేస్తున్నట్లు, ఇది అత్యంత పెద్ద ప్రాజెక్టు అని ఆయన చెప్పారు. మూడు ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం ఉన్న గ్రామం తొర్రూర్ ఒక్కటేనని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలోని ప్రతి డిగ్రీ కాలేజీలో నాలెడ్జి సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు సి.యస్. రావు మరో కార్యక్రమంలో చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అత్యధిక ప్రాచుర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. నాలెడ్జి సెంటర్లో 50 మందికి ఐటి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ప్రయోగాత్మకంగా మొదట వేయి పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది రెండు వేల పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 45 నుంచి 50వేల ప్రభుత్వ పాఠశాలలున్నట్లు ఆయన తెలిపారు.