మీడియా ముందుకు సాగర్ సహా 17 మంది నక్సల్స్
హైదరాబాద్: సిపిఐ (యంయల్) జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యుడు సాగర్తో పాటు 17 మంది నక్సల్స్ను కరీంనగర్ జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సాగర్తో పాటు 17 మందిని పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచుకున్నట్లు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక సోమవారంనాడు ఒక వార్తను ప్రచురించింది. దీంతో సాగర్, జాన్సన్, రఘు, ఇతర జనశక్తి నక్సల్స్ను మీడియా ముందు ప్రవేశపెట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సాగర్తో పాటు మిగతావారిని అందుకుగాను కరీంనగర్ తరలించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలావుంటే, సాగర్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తనకేమీ తెలియదని హోం మంత్రి కె. జానారెడ్డి సోమవారంనాడు మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒక వేళ సాగర్ను, మిగతా నక్సల్స్ను పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని వుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు. ఈ విషయమైన హోం మంత్రి పక్కనే ఉన్న పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ నోరు మెదపలేదు.