బిసిలపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: టిడిపి
హైదరాబాద్: వెనకబడిన తరగతుల (బిసి) జాబితా నుంచి కొన్ని కులాలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఇందులో భాగంగా జారీ చేసిన 23వ నెంబర్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. బిసి జాబితాకు సంబంధించి కమీషన్ వేసి, కొన్ని కులాలను జాబితా నుంచి తొలగించేందుకు ఆ జీవోను ప్రభుత్వం జారీ చేసిందని ఆయన అన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారని బిసిలపై కాంగ్రెస్ కక్ష కట్టిందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం తయారు చేసిన ఓటర్ల జాబితాలో 30 శాతం మంది పేర్లను తొలగించారని ఆయన విమర్శించారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోకుండా బిసిలను తొలగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బిసిలను ఓటర్ల జాబితా నుంచి తొలగించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన అడిగారు.