సెప్టెంబర్ 24న మున్పిపల్ను ఎన్నికలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమీషన్ సోమవారంనాడు జారీ చేసింది. మున్సిపాలిటీలకు, కార్పోరేషన్లకు సెప్టెంబర్ 24వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. 26వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 30వ తేదీన కార్పోరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల, మున్సిపాలిటీల చైర్పర్సన్ల, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని 96 మున్సిపాలిటీలకు, 11 కార్పోరేషన్లకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ నేటి నోటిఫికేషన్తో ప్రారంభమైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించడం లేదు.
ఎన్నికల నియమావళి నేటి నుంచి అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి ఎ.వి.యస్. రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నిబంధనలకు మించి ఎన్నికల్లో ఖర్చు చేస్తే కూడా చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు 30 మంది అధికారులను నియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 9వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.