మావోయిస్టులపై నిషేధం సబబే: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులను, దాని అనుబంధ సంస్థలను నిషేధించడం సబబేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి వివేకంతో కూడిన నిర్ణయం తీసుకున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిషేధం విధించడానికి ముందు ముఖ్యమంత్రి సీనియర్లతోనూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ, హోం మంత్రి శివరాజ్ పాటిల్తోనూ చర్చించారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్)తోనూ చర్చించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మావోయిస్టులు ఒక సీనియర్ శాసనసభ్యుడితో పాటు పది మందిని హత్య చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, పరిస్థితిలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. మావోయిస్టుల నిషేధంపై తాను ఎక్కువగా వ్యాఖ్యానించదలుచుకోలేదని ఆయన అన్నారు. నిషేధం విధించే విషయంలో నిర్ణయాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికే వదిలేశామని ఆయన చెప్పారు. రేపు (మంగళవారంనాడు) టి ఆర్యస్ నేత కె. చంద్రశేఖర్ రావును తాను హైదరాబాద్లో కలిసి మాట్లాడుతానని ఆయన చెప్పారు.