దేవాదాయ కమీషనర్గా ప్రసాద్ అనర్హుడు: హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్గా జె.వి.యస్. ప్రసాద్ అనర్హుడని హైకోర్టు సోమవారంనాడు ప్రకటించింది. దేవాదాయ కమీషనర్గా ప్రసాద్ స్థానంలో మరో అధికారిని నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రసాద్ నియామకం దేవాదాయ నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తెలియజేసింది. దేవాదాయ శాఖ కమీషనర్గా 45 ఏళ్ల వయస్సు నిండినవారినే నియమించాలనే నిబంధనలకు విరుద్ధంగా 43 ఏళ్ల వయస్సు మాత్రమే ఉన్న ప్రసాద్ను నియమించడం సరి కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రకాశం జిల్లాలోని దేవాదాయ శాఖ ఉద్యోగి పప్పుల వెంకట్రావు వేసిన పిటిషన్పై హైకోర్టు ఆ తీర్పును వెలువరించింది. అవినీతి ఆరోపణలపై పప్పుల వెంకట్రావును జె.వి.యస్. ప్రసాద్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ను ఎత్తివేయించుకోవడానికి వెంకట్రావు అన్ని ప్రయత్నాలూ చేశారు. అయితే ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో తనను సస్పెండ్ చేసే అధికారం ప్రసాద్కు లేదంటూ వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ప్రతిస్పందిస్తూ ప్రసాద్ నియామకం చెల్లదని ప్రకటించింది. అయితే వెంకట్రావు సస్పెన్షన్పై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు ప్రకటించింది.