మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల ఘట్టం పూర్తి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారంనాడు ముగిసింది. పలు మున్సిపాలిటీల్లో, నగర పాలక సంస్థల్లో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేశారు. విజయవాడలో తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థులు ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడలో కాంగ్రెస్, వామపక్షాలకు మధ్య పొత్తు కుదిరింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చొరవతో పిసిసి అధ్యక్షుడు జోక్యం చేసుకుని సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిర్చారు.
కాకినాడలో పెద్ద యెత్తున అభ్యర్థులు తమ అనుచరగణాలతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. తమను లోనికి అనుమతించాలని పార్టీల కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఏలూరులో తెలుగుదేశం కార్యకర్తలు అసమ్మతికి గురై పార్టీ జెండాలను తగులబెట్టారు. కరీంనగర్లో పార్టీ కార్యాలయం వద్ద దళిత మహిళలు ధర్నాకు దిగారు. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వారు ఈ ధర్నా చేశారు. పార్టీ కార్యకర్తలు కొందరు విధ్వంసానికి దిగారు. నెల్లూరు, ఒంగోలు, వరంగల్, అనంతపురం, తదితర మున్సిపాలిటీల్లో, నగర సాలక సంస్థల్లో పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలయ్యాయయి.
సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ వైఖరికి వామపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. విజయవాడ, ఖమ్మంలలో తప్ప మరెక్కడా సీట్ల సర్దుబాటు జరగకపోవడంపై, ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల వైఖరిపై సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు బలం ఉన్న చోట్ల కూడా సీట్లను ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులు నిరాకరిస్తున్నారని ఆయన అన్నారు. సిపిఐతో తమకు పూర్తి స్థాయిలో అవగాహన కుదిరిందని ఆయన అన్నారు. కాంగ్రెస్తో పొత్తులు కుదరని చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. కర్నూలు, ఖమ్మంలో ఈ సాయంత్రానికి వామపక్షాలకు, తమకు మధ్య సర్దుబాటు అవగాహన కుదురుతుందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. వామపక్షాలకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.
గుంటూరు కార్పోరేషన్లో కాంగ్రెస్ నాయకులు తమ వారసులకే టికెట్లు ఇచ్చుకున్నారని కాంగ్రెస్ నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా రేపల్లె, బాపట్లలలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు రంగంలోకి దిగారు.