కెసిఆర్కు 8 అంశాలతో వినతిపత్రం ఇచ్చా: వివి
గుంటూరు: జైలులో కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు కె. చంద్రశేఖర్ రావుకు 8 అంశాలతో ఒక వినతిపత్రాన్ని అందజేసినట్లు విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు చెప్పారు. పోలీసు స్టేషన్పై దాడి కేసులో పోలీసులు సోమవారంనాడు విరసం అధ్యక్షుడు జి. కళ్యాణరావును, వరవరరావును గుంటూరు జిల్లా చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 19వ తేదీ వరకు వారికి కోర్టు జ్యుడిషయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కేసు వివరాలను చెప్పకుండానే పోలీసులు తమను కోర్టుకు తీసుకుని వచ్చారని వరవరరావు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తమ ఆరోగ్యాలు బాగా లేనందున చార్జిషీట్ తయారయ్యే వరకు తమ హాజరును సస్పెండ్ చేయాలని వరవరరావు, కళ్యాణరావు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. పోలీసు స్టేషన్పై దాడి కేసులో తనను ఇరికించడం అక్రమమని వరవరరావు అన్నారు. తాను విరసం వ్యవస్థాపక సభ్యుడిని మాత్రమేనని, తనకు మావోయిస్టులతో సంబంధాలు లేవని ఆయన చెప్పారు. నక్సల్స్పై నిషేధం ఉన్న కాలంలో తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కూడా కలుసుకున్నానని, కెసిఆర్ను కలుసుకుంటే తప్పా అని ఆయన అన్నారు.