నరేంద్ర రాజీనామా చేసి మాట్లాడితే మంచిది: సిపియం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నేత ఎ. నరేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఏమైనా మాట్లాడాలని, అప్పుడే నరేంద్ర ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. నరేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకుంటే మంచిదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సలహా ఇచ్చారు.
తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేసిన టి ఆర్యస్ నేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలను ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వంలో కొనసాగనివ్వ వద్దని ఆయన కాంగ్రెస్కు సూచించారు. ప్రత్యేక తెలంగాణ సాధిస్తామని చెప్పిన టిఆర్యస్ నాయకులు ఘోరంగా విఫలమై ఆడలేక మద్దెల ఓడన్నట్లు తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన వామపక్షాలపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి పదవి వదులుకోలేని నరేంద్ర ఎ.కె. 47 ఏం పట్టుకోగలడని, ఎ.కె. 47తో ఎవరిపై పోరాటం చేస్తాడని, కేంద్ర ప్రభుత్వం మీదనా, రాష్ట్ర ప్రభుత్వం మీదనా అని ఆయన అడిగారు.
నరేంద్ర మాటలు చట్ట విరుద్ధం మాత్రమే కాదు, రాజకీయంగా అనైతికం కూడా అని ఆయన అన్నారు. రోడ్లు శుభ్రం చేసేందుకు, ప్రాజెక్టులు కట్టేందుకు జాగరణ సేనకు కర్రలెందుకని ఆయన అడిగారు. టి ఆర్యస్ నాయకులు చెప్పేదొకటి, వారి ఉద్దేశం మరోటి అని ఆయన అన్నారు. రక్తం పారించడమే ఉద్దేశమైతే స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.