హత్య కేసులో కాంగ్రెస్ నేత అరెస్టుకు డిమాండ్, ధర్నా
హైదరాబాద్: ప్రేమించిన నేరానికి హత్య చేసిన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ను, ఇతరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హత్యకు గురైన మహేష్ గౌడ్ బంధువులు మంగళవారం పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. మహేష్ గౌడ్ సోమవారంనాడు దారుణ హత్యకు గురయ్యాడు. మహేష్ గౌడ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్గా ఉన్న కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ కూతురు స్రవంతిని ప్రేమించి రహస్యంగా వివాహమాడాడు. ఆ తర్వాత మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లి వారిద్దరూ నివసించసాగారు. అయితే ఆ కాలంలో శ్రీనివాస్ తన మనుషుల చేత మహేష్ గౌడ్ తలిదండ్రులను చిత్రహింసలు పెట్టాడనే ఆరోపణలున్నాయి.
తిరిగి వస్తే పెళ్లి చేస్తానని శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు అందించిన సమాచారం మేరకు మహేష్గౌడ్, స్రవంతి ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చారు. అయితే శ్రీనివాస్ వారిద్దరినీ విడదీశాడని, దీంతో వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారని, భవంతి పైకి ఎక్కి ఒకరినొకరు చూసుకుంటూ ఉండేవారని సమాచారం. ఎప్పటి లాగే భవనం పైకి ఎక్కిన మహేష్ గౌడ్ను శ్రీనివాస్ మనుషులు వెంటాడి వేటాడి ఒక అపార్ట్మెంట్లో దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన హైదరాబాద్లోని రాంనగర్ గుండు ప్రాంతంలో జరిగింది.
శ్రీనివాస్ను, ఇతర హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహేష్ గౌడ్ బంధువులు సంబంధిత పోలీసు స్టేసన్ ఎదుట ధర్నా చేశారు. శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి ఉంది. శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో పాటు పరారీలో ఉన్నాడని, అతడ్ని ఒకటి రెండు రోజుల్లో పట్టుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించుకున్నారు. కాగా, హత్యకు సహకరించిన పోలీసు కానిస్టేబుల్ సుదర్శన్ను, అపార్ట్మెంట్ వాచ్మన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.