కాంగ్రెస్ నమ్మకద్రోహి: నరేంద్ర ధ్వజం
నిజామాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి పాల్పడుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన మంగళవారంనాడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో అనంతరం ఆయన సభలో ప్రసంగించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తున్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు కలిసి పోటీ చేయడమే మార్గమని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టి ఆర్యస్ అనుకుని పోటీ చేశాయని, అయితే కాంగ్రెస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ సాధనకు టిఆర్యస్ విజయం ఒక్కటే మార్గమని, ఈ ఎన్నికల్లో టి ఆర్యస్ గెలిచి తీరుతుందని ఆయన అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్కు తన కొడుకు విజయం తప్ప ఏమీ పట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కోబ్రాస్ ప్రభుత్వ సృష్టేనని నరేంద్ర మీడియా ప్రతినిధులతో అన్నారు. కోబ్రాస్ సృష్టికి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి, పోలీసులు అధికారులు వీరిలో ఎవరు కారణమని, ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. పంజాబ్ను రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు లేని అభ్యంతరం, హిందీ ప్రాంతాలను ఎనిమిది రాష్ట్రాలుగా విభజించినప్పుడు లేని అభ్యంతరం, ఆంధ్రప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విభజిస్తే సిపియం నాయకుడు సీతారాం ఏచూరికి అభ్యంతరం ఏమిటని ఆయన అన్నారు. తెలంగాణ జనజాగరణ సేన విషయంలో నిరసనలు, ఆందోళనలు అవసరం లేదని ఆయన అన్నారు.