నరేంద్ర వ్యాఖ్యలపై మాట్లాడబోను: వైయస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర వ్యాఖ్యలపై తాను ఏమీ మాట్లాడబోనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. నరేంద్ర వ్యాఖ్యలపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. నరేంద్ర కన్నా తీవ్రమైన భాషను తాము వాడగలమని, అయితే తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. నరేంద్ర విజ్ఞతకే ఆయన చేసిన వ్యాఖ్యలను వదిలేస్తున్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రణాళిక విడుదల సందర్భంగా వారు మంగళవారం ఆ విధంగా అన్నారు.
నరేంద్ర తన భాషను మార్చుకుని హుందాగా వ్యవహరించాలని, లేకుంటే తమ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యదర్శి సుధాకర్ రెడ్డి అన్నారు. టి ఆర్యస్ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పి) తమ పార్టీ అధిష్ఠానవర్గానికి ఫిర్యాదు చేసింది. టి ఆర్యస్ నేతలు కె. చంద్రశేఖర్ రావును, నరేంద్రను మంత్రివర్గం నుంచి తొలగించాలని సియల్పి డిమాండ్ చేసింది. టి ఆర్యస్ వ్యవహారాలపై పిసిసి, సియల్పిలు తమ పార్టీ అధిష్టానానికి నివేదికలు పంపాయి.