జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి: సిపియం
వరంగల్: జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే తమకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ఆయన గురువారంనాడు వరంగల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. బూర్జువా పార్టీలు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం బిజెపి, టి ఆర్యస్లు పుట్టక ముందు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పోరాటం చేశాయని, 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. తెలంగాణ వారసులు కమ్యూనిస్టులు, కాంగ్రెస్వారు తప్ప ఇతరులు కారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేసిందని ఆయన విమర్శించారు. ప్రపంచ బ్యాంకు విధానాలను అనుసరిస్తే కాంగ్రెస్ను కూడా తాము వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.