శాంతి ప్రక్రియ కొనసాగింపు: మన్మోహన్, ముషారఫ్
న్యూయార్క్: శాంతి ప్రక్రియను కొనసాగిస్తామని భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఒక సంయుక్త ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ సమస్యతో పాటు అన్ని వివాదాస్పద అంశాలను అన్నింటినీ శాంతియుద్ధ పద్ధతుల్లో పరిష్కరించుకుంటామని వారు చెప్పారు. ఈ ఇద్దరు నేతలు దాదాపు నాలుగు గంటల సేపు సమావేశమయ్యారు. అనంతరం సంయుక్త ప్రకటన చేశారు.
ఉగ్రవాదం శాంతి ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఇరు దేశాల ప్రజలకు మధ్య సంబంధాలు నెలకొల్పి విశ్వాసం పెంపొందిచుకునే చర్యలను పటిష్టం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. సమస్యల పరిష్కారానికి నిజాయితీతో కూడిన స్ఫూర్తితో, ప్రయోజనకరమైన పద్ధతిలో కృషి చేస్తామని వారు చెప్పారు.
తాను భారత ప్రధాని మన్మోహన్ సింగ్ను పాకిస్థాన్ పర్యటనకు ఆహ్వానించినట్లు, అందుకు మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు ముషారఫ్ తెలిపారు. చర్చలు తనకెంతో సంతృప్తినిచ్చాయని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి వారు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రకటన సరిపోతుందని ముషారఫ్ చెప్పారు.