తెలంగాణను వంచిస్తే పుట్టగతులుండవు: కెసిఆర్
హైదరాబాద్/ మెదక్: తెలంగాణను వంచిస్తే పుట్టగతులుండవని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మెదక్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన కాంగ్రెస్పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ను తమ పార్టీ ఆదుకుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు తెలంగాణ జాగరణ సేన ఏర్పాటుపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కారుకే వేయండని ఆయన పిలుపునిచ్చారు.
మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ ప్రహ్లాద్ను కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టు నేతలను అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారని ఆయన గురువారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 40 వేల క్యూసెక్కుల కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయంపై కోస్తా నాయకులు ఆలోచించాలని ఆయన సూచించారు. ఇది ఏ రకమైన నీటి దోపిడీ అని, ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం నీళ్లను తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని గెలుస్తాం, అన్ని గెలుస్తామని డంబాచారలు కొట్టడం లేదని, తెలంగాణ వ్యతిరేకుల నోళ్లు మున్సిపల్ ఎన్నికల ద్వారా ఓటర్లే మూయిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారి నోళ్లు ఓటర్లే మూయిస్తారని ఆయన అన్నారు.
కోబ్రాస్ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి తమను విమర్శించే హక్కు లేదని, కోబ్రాస్ను సృష్టించి హింసను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాము తెలంగాణ జాగరణ సేనను ఏర్పాటు చేయడాన్ని విమర్శిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి మరో నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు.