టిజెయస్కు ఆర్యస్యస్, విహెచ్పి శిక్షణ: బాబు
హైదరాబాద్: తెలంగాణ జనజాగరణ సేనకు (టిజెయస్)కు ఆర్యస్యస్, విహెచ్పిలతో శిక్షణ ఇప్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) లౌకికవాదం గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలో ప్రచారం చేయడానికి శుక్రవారం ఉదయం బయలుదేరే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాంగ్రెస్, టి ఆర్యస్లు కుహనా లౌకికవాద పార్టీలని ఆయన అన్నారు.
టిజెయస్ను ఏర్పాటు శిక్షణ ఇప్పిస్తూ, ఇష్టం వచ్చినట్లు టి ఆర్యస్ నాయకులు మాట్లాడుతుంటే చర్యలు తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయనిన, ఈ మోసాన్ని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. తన రోడ్ షోలకు అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని ఆయన విమర్శించారు. టిఆర్యస్ నేత నరేంద్రను అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, టి ఆర్యస్ తోడుదొంగలని ఆయన మెదక్ జిల్లాలో జరిపిన ప్రచార కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తాను కాళ్లు అడ్డం పెడితే నీళ్లు వస్తాయని చంద్రశేఖర్రావు అన్నారని, ఇప్పుడు అడ్డం పడినా నీళ్లు రావని ఆయన ఎద్దేవా చేశారు. సొంత జిల్లాకు కూడా హెలికాప్టర్ ఉంటే తప్ప రాలేని చంద్రశేఖర్ రావు ప్రజలకేం సేవ చేస్తారని ఆయన అడిగారు. కాంగ్రెస్, టిఆర్యస్లను చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రశేఖర్ రావు పదవుల కోసం పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. తాము సమైక్యాంధ్రకు, లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.