పోశెట్టి అంత్యక్రియల్లో వివాదం, గందరగోళం
నిజామాబాద్: నిజామాబాద్లోని 36వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఏజెంటు మృతి వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ వార్డు నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్ కుమారుడు పోటీ చేస్తుండడంతో పోశెట్టి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారంనాడు అంత్యక్రియల సందర్భంగా తీవ్ర వివాదం చెలరేగింది.
మంత్రి డి. శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోశెట్టి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారు హడావిడిగా అంత్యక్రియలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోశెట్టి మృతిపై న్యాయవిచారణ జరిపించాలని టి. దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పోశెట్టి మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తాను విచారణ జరిపించాలని కోరుతున్నానని, పోశెట్టి హత్యకు కారకులెవరో తేలాల్సిన అవసరం ఉన్నదని మంత్రి డి. శ్రీనివాస్ అన్నారు.