గాంధీభవన్లో జపాన్యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఉన్న గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాల్లో శుక్రవారంనాడు జపాన్ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఈ విషయమై జపాన్ యువతి నకిమూరు మహితో హైదరాబాద్లోని బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి యత్నించిన దుండగుడు గాంధీభవన్లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ఆఫీస్ బేరర్ కావడం గమనార్హం. అయితే ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి యాదవరెడ్డి అన్నారు. అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తి ఎవరో తమకు తెలియదని, అతనితో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.
ప్రకాశం హాల్కు దారి చూపిస్తానని చెప్పి దుండగుడు యువతిపై అత్యాచారం జరపడానికి ప్రయత్నించాడు. ప్రకాశం హాల్ తాళం తీసిన తర్వాత ఆ వ్యక్తి ఆమెపై చేయి వేసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని, ఆమె తప్పించుకుని వచ్చి అక్కడ చుట్టుపక్కల వున్నవారికి చెప్పిందని, వారందరూ అక్కడికి చేరుకునే లోపల ఆ దుండగుడు పారిపోయాడని సమాచారం. జపాన్ యువతి నకిమురు మహికో రేపు ప్రకాశం హాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇక్కడికి వచ్చింది. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ శాఖలో పిహెచ్డి చేస్తోంది. పోలీసులు రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నగరంపై విదేశాల్లో పెరుగుతున్న ఆదరణకు గాంధీభవన్లో జరిగిన అత్యాచార యత్నం సంఘటన ఒక మచ్చ అని ఇండో జపాన్ మైత్రీ సంఘం వ్యాఖ్యానించింది.