ఢిల్లీలో పరువు కోసం వైయస్ అక్రమాలు: బాబు
హైదరాబాద్: కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోగలిగితే మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం తమదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము విజయం సాధించి తీరుతామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల మార్కు రాజకీయాలను రాష్ట్రమంతటా అమలు చేయాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
ఢిల్లీలో పరువు నిలుపుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన రోడ్షోలకు అనూహ్యమైన స్పందన లభించిందని, ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసిగిపోయి వున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెచ్చరిల్లిందని, డబ్బులు దండుకున్నారని ఆయన విమర్శించారు. కొన్ని చోట్ల ఓడినా పర్వాలేదు గానీ డబ్బులు పంచవద్దని ఆయన తెలుగుదేశం నాయకులకు పిలుపునిచ్చారు.
వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు. వరదలతో నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజలను విస్మరించి కాంగ్రెస్వారు రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. వరదలు ఉధృతంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కనీసం పరిస్థితి గురించి కూడా వాకబు చేయలేదని ఆయన తప్పు పట్టారు.