సహాయం భేష్, తిన్నది అరగని బాబు: వైయస్
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో సమర్థంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విమర్శల కోసం విమర్శలు చేస్తున్నారని, విమర్శలు చేసి తిన్నది అరిగించుకునే కార్యక్రమం పెట్టుకున్నారని, విమర్శించకపోతే తిన్నది అరగదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పరిశీలిస్తున్నామని, తప్పులు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
వరద ఉధృతి తగ్గుతోందని, అయితే అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 10,646 కుటుబాలకు లక్ష క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశామని ఆయన చెప్పారు. ఇంకా పునరావాస శిబిరాల్లో 1,22,661 మంది ఉన్నారని ఆయన అన్నారు. రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశామని, మంచినీరు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. పునరావాస శిబిరాల్లో ఏ విధమైన ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి వేయి నుంచి 1500 రూపాయలేసి ఇచ్చామని ఆయన చెప్పారు.
వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం ఈ నెల 26 లేదా 27వ తేదీన రాష్ట్రానికి వస్తుందని ఆయన చెప్పారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ నాలుగైదు రోజుల్లో వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించడానికి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో పరిస్థితిని సోనియా అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు.
విజయవాడలో 37 వేల మంది పునరావాస శిబిరాల్లో ఉంటున్నారని, విజయవాడలో 8,500 ఇళ్లు పూర్తిగా, 3,500 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయని ఆయన చెప్పారు. రాయపట్నం వంతెన వద్ద కరీంనగర్కు రాకపోకలను రేపటిలోగా పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ నష్టాలపై నివేదికలను తెప్పిస్తున్నామని ఆయన చెప్పారు. విజయవాడ మున్సిపల్ కమీషనర్పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా, బుడమేరుల ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామని ఆయన చెప్పారు.