నిందితుడ్ని పట్టించింది మావారే: కేశవరావు
హైదరాబాద్: జపాన్ యువతిపై అత్యాచార యత్నం కేసులో నిందితుడ్ని పట్టించింది తమ పార్టీవారేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. అత్యాచార యత్నం సంఘటనతో తమ పార్టీ కార్యాలయ సిబ్బందికి ఏ విధమైన సంబంధం లేదని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ సంఘటన తమ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
జపాన్ యువతిపై ప్రకాశం హాల్లో అత్యాచార యత్నం సంఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు శోభానాగిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సంఘటన కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతోందని ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. నిందితుడిని అరెస్టు చేయించాల్సిందిపోయి కాంగ్రెస్ నాయకులు రాజీకి ప్రయత్నాలు ప్రారంభించారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే మహిళలకు రక్షణ కల్పించలేకపోతే ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఎలా రక్షణ కల్పించగలదని ఆమె ప్రశ్నించారు. పోలీసులు నిందితుడ్ని వదిలేసి అమ్మాయిని విచారించడం దారుణమని ఆమె అన్నారు.