బిజెపి స్పందన అందాక తెలంగాణపై సిఫార్సు: ప్రణబ్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్పందన అందిన తర్వాతనే తెలంగాణపై తమ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణపై ఏర్పాటయిన ఉపసంఘం చైర్మన్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. శుక్రవారంనాడు హైదరాబాద్లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేశాయని, బిజెపి అభిప్రాయం మాత్రమే రావాల్సి ఉందని, బిజెపి అభిప్రాయం రాగానే తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన చెప్పారు. తాము ప్రభుత్వానికి సిఫార్సు మాత్రమే చేయగలమని ఆయన చెప్పారు.
అంతకు ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీ (టిఆర్సిసిసి) నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మంత్రి జె. గీతారెడ్డి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణపై మాట్లాడారు. బీహార్ శాసనసభ ఎన్నికల తర్వాత తమ కమిటీ మళ్లీ సమావేశమవుతుందని ప్రణబ్ వీరికి చెప్పినట్లు సమాచారం. బిజెపి అభిప్రాయం అందిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్ వారితో చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదిస్తే అన్ని పార్టీల మద్దతు అవసరం ఉంటుందని ప్రణబ్ చెప్పినట్లు సమాచారం.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలంగాణపై నిర్ణయం వెల్లడించాలని తాము ప్రణబ్ను కోరినట్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులపై, వారి వ్యాఖ్యలపై ప్రణబ్తో రాష్ట్ర నాయకులు ప్రస్తావించలేదని సమాచారం.