తెరాస నేతలు కెసిఆర్, నరేంద్రలపై కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కె. చంద్రశేఖర్రావు, ఎ. నరేంద్రలపై హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. వారితో పాటు మరో 30 మంది తెరాస నాయకులు, కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. కెసి ఆర్, నరేంద్రలు హింసను ప్రేరేపించేవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై కోర్టు ప్రతిస్పందిస్తూ కెసిఆర్పై, నరేంద్రపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తెరాస నాయకులపై కుట్ర కేసు నమోదైంది.
కోర్టు ఆదేశాలు బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం మధ్యాహ్నం అందాయి. దీంతో తెరాస నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపిసి 153 ఎ, 505, 149, 123 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులు తెరాస నాయకులపై కేసులు పెట్టారు. తెరాస నాయకుల అరెస్టుకు కూడా పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అందుకు అవసరమైన అనుమతులను పొందేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.