నాకిప్పుడు విశ్రాంతి అవసరం: గంగూలీ
కోల్కత్తా: వచ్చే సిరీస్కు సిద్ధం కావడానికి తనకు విశ్రాంతి అవసరమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ముంబాయిలో జరిగిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సమావేశంలో పాల్గొన్న గంగూలీ బుధవారం ఇక్కడికి తిరిగి వచ్చారు. వచ్చే నెలలో జరిగే సిరీస్ సవాళ్లతో కూడుకున్నదని, దానికి సిద్ధం కావడానికి ప్రస్తుతం తనకు విశ్రాంతి అవసరమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
కోచ్ గ్రెగ్ చాపెల్తో తనకు ఏ విధమైన ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. బిసిసిఐ సమీక్షా సమావేశం వివరాలను వెల్లడించడానికి మాత్రం ఆయన నిరాకరించారు. చాపెల్తో పని చేయడానికి తనకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవని ఆయన మంగళవారం రాత్రి ముంబాయిలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. చాపెల్కు, తనకు మధ్య జరిగిన వివాదంపై బిసిసిఐ సమావేశంలోని వివరాలను ఆయన వెల్లడించడానికి నిరాకరించారు. బిసిసిఐ రణబీర్ సింగ్ మహేంద్ర ఇప్పటికే టెలివిజన్తో మాట్లాడారని, తాను మాట్లాడడానికేమీ లేదని ఆయన అన్నారు.
టెస్టు క్రికెట్లో తమ ఆటతీరు బాగుందని, అయితే వన్డేల్లో, ముఖ్యంగా ఫైనల్లో తమ ఆటతీరును మెరుగు పరుచుకోవాల్సి వుంటుందని గంగూలీ అన్నారు.