నరేంద్రను విమర్శించడం తప్పు: నాయని
హైదరాబాద్: తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రను తమ పార్టీ శాసనసభ్యులు ఇద్దరు విమర్శించడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి నరేంద్రనే కారణమని తెరాస శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు విమర్శించిన విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలకు ముందు ఆ విధంగా విమర్శలు చేసి వెలిగిపోదామనుకోవడం సరి కాదని నాయని నర్సింహారెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఏ విషయమైనా పార్టీ వేదికలపై మాట్లాడితేనే బాగుంటుందని, ఇద్దరు శాసనసభ్యుల వ్యవహారంపై శాసనసభా పక్షం సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. నరేంద్రపై బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, అది సరి కాదని ఆయన అన్నారు. నరేంద్ర పద్ధతి నచ్చకపోతే ఇంతకాలం ఎందుకు నోళ్లు మూసుకున్నారని ఆయన అడిగారు. శాసనసభ్యుల వ్యవహారంపై ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పార్టీ అంతా ఒక తాటిపైనే ఉందని ఆయన అన్నారు.