టిజెయస్పై దుష్ప్రచారం వల్లనే నష్టం: తెరాస
హైదరాబాద్: తాము ఏర్పాటు చేసిన తెలంగాణ జాగరణ సేన (టిజెయస్)పై రాజకీయ పార్టీల దుష్ప్రచారం వల్ల తమకు మున్సిపల్ ఎన్నికల్లో నష్టపోయామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్షం నాయకుడు విజయరామారావు అన్నారు. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం జరిగిన శాసనసభా పక్షం సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టిజెయస్పై దుష్ప్రచారాన్ని తాము ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మునిగి ఉండడం వల్ల సమర్థంగా తిప్పికొట్టలేకపోయామని ఆయన అన్నారు.
టిజెయస్ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పరిధిలో తెలంగాణ భావవ్యాప్తికి పని చేస్తుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం రాష్ట్ర నిర్మాణానికి కృషి చేస్తుందని, ఈ విషయాన్ని తమ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు పదే పదే చెబుతూ వచ్చారని ఆయన చెప్పారు. అయినా టిజెయస్ను కొన్ని సార్లు ఆరెస్సెస్తో, మరికొన్ని సార్లు మావోయిస్టులతో ముడిపెట్టి దుష్ప్రచారాన్ని కొనసాగించారని ఆయన అన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో తాము కాంగ్రెస్తో పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటామని, తాము 11 మున్సిపాలిటీల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నామని ఆయన చెప్పారు. మిగతా ప్రాంతాల్లో మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణలో చాలా చోట్ల పూర్తి మెజారిటీని సంపాదించలేకపోయిందని, తమ బలం వల్లనే చాలా చోట్ల తెలంగాణలో హంగ్ ఏర్పడిందని ఆయన అన్నారు.