సమావేశానికి ఎమ్యెల్యేలు మందాడి, దుగ్యాల గైర్హాజర్
హైదరాబాద్: పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాస రావు గైర్హాజరయ్యారు. పార్టీ అధినేతలు కె. చంద్రశేఖర్ రావుపై, ఎ. నరేంద్రపై వారిద్దరు మంగళవారం నాడు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెరాస శాసనసభా పక్షం సమావేశం బుధవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాసంలో ఏర్పాటయింది.
మందాడి సత్యనారాయణ రెడ్డి, ద్యుగాల శ్రీనివాసరావులను బుజ్జగించడానికి చంద్రశేఖర్ రావు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని సమాచారం. వారిద్దరు బహిరంగంగా విమర్శలు చేయడాన్ని తెరాస శాసనసభ్యుడు, మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి తప్పు పట్టారు. అయితే తాము ఆ విధంగా విమర్శలు చేయడాన్ని మందాడి సత్యనారాయణ రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు సమర్థించుకున్నారు. పార్టీని చక్కదిద్దడానికే తాము ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనకు పునరంకింతం కావడానికి వీలుగానే తాము మాట్లాడామని వారన్నారు.