అసెంబ్లీ: స్కాన్స్కాకు పనుల అప్పగింతపై గందరగోళం
హైదరాబాద్: స్కాన్స్కా కంపెనీకి సాగునీటి ప్రాజెక్టుల పనుల అప్పగింతపై మంగళవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. అర్హతలు లేని స్కాన్స్కా కంపెనీకి సాగునీటి ప్రాజెక్టుల పనులు అప్పగించారని తెలుగుదేశం శాసనసభా పక్షం ఉపనాయకుడు నాగం జనార్దన్ రెడ్డి శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విమర్శించారు. దానికి సంబంధించిన ఫైళ్లను స్పీకర్ ముందుంచాలని తెలుగుదేశం సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ అంశంపై తెలుగుదేశం సభ్యులు పట్టువీడకపోవడంతో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి నిరసన తెలిజేసి తదుపరి కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఇవ్వాలని సూచించారు. అందుకు టిడిపి నిరాకరిస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టముట్టారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్కాన్స్కా కంపెనీకి అర్హతలున్నాయని రుజువు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన సమాధానానికి టిడిపి సభ్యులు సంతృప్తి చెందలేదు. తాము ప్రభుత్వ సమాధానికి సంతృప్తి చెందలేదని, తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా అధికార పక్షం మొండివాదనకు దిగుతోందని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ఈ సమయంలో కిరణ్కుమార్ రెడ్డి (కాంగ్రెస్) జోక్యం చేసుకుని - తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకమని అందరికీ తెలుసునని, సుప్రీంకోర్టు మొట్టి కాయలు వేసినా టిడిపి బుద్ధి రాలేదని అన్నారు. దీనికి టిడిపి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్ద గుమికూడారు.
సభ ఎంతకీ సద్దు మణగకపోవడంతో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకుని సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరగలేదని, తెలుగుదేశం పార్టీ అర్థం లేని విమర్శలు చేస్తోందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ వారికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్య సభను స్పీకర్ రెండోసారి వాయిదా వేశారు. స్కాన్స్కాకు పనుల అప్పగింతపై సమగ్ర విచారణ జరిపించి సభ ముందుంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సభ సద్దుమణిగింది.
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఫైళ్లను స్పీకర్ వద్ద ఎందుకు పెట్టరని నాగం జనార్దన్ రెడ్డి అడిగారు. సుప్రీంకోర్టులో ప్రీక్వాలిఫైడ్ టెండర్ల పొరపాట్లపై చర్చ జరగలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.