పార్టీలకు అతీతంగా ముందుకు రండి: తెరాస
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డి హెడ్రెగ్యులేటర్కు 40వేల క్యూసెక్కుల కృష్ణా జలాలను తరలిస్తూ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన 170 నెంబర్ ఉత్తర్వుల ఉపసంహరణ ఉద్యమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పిలుపునిచ్చింది. 170 నెంబర్ జీవో ద్వారా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆరు జిల్లాలకు అన్యాయం చేసే పనికి ఒడిగట్టారని తెరాస శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్లోని డెడ్ స్టోరేజీ నీటిని కృష్ణా డెల్టా రైతులకు అందిస్తారని, కృష్ణానది ఎగువ జలాలను రాయలసమీకు తరలిస్తారని, ఆ రకంగా తెలంగాణకు అన్యాయం చేయడానికి పూనుకున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైతే వారు తమ ప్రాంతాలకు నీటిని తరలించుకుపోవడానికి పూనుకుంటున్నారని అంటూ ఇదేం ప్రజాస్వామ్యమని ఆయన అడిగారు. శ్రీబాగ్ ఒప్పందం పేరుతో కాంగ్రెస్ తెలంగాణ నోరు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.