మాకే విజయవాడ మేయర్ పదవి: కెకె
హైదరాబాద్: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పదవి తమ పార్టీదేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. వామపక్షాలకు కావాలంటే రెండో విడత ఇవ్వడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఆయన మంగళవారం విజయవాడ కాంగ్రెస్ నాయకులతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ డివిజన్లు వచ్చినందును మేయర్ పదవిని వామపక్షాలకు ఇవ్వకూడదని కొందరు విజయవాడ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో కేశవరావును కలిసి కోరారు. దీంతో కేశవరావు ఆ విషయంపై మాట్లాడారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. రెండో విడత మేయర్ పదవిని వామపక్షాలకు ఇవ్వడానికి తనకైతే అభ్యంతరం లేదని, అయితే నిర్ణయాన్ని స్థానిక నాయకులకే అప్పగించామని, అందువల్ల అక్కడి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ 29 డివిజన్లను గెలుచుకుని పూర్తి మెజారిటీని సాధించుకుంది. వామపక్షాలకు 17 డివిజన్లు దక్కాయి.
మేయర్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్లో ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మైనారిటీలకు మేయర్ పదవికి ఇవ్వాలని అంటుండగా, అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ అంటున్నారు.
అయితే, మేయర్ పదవి విషయంలో సిపిఐ కొలికి పెడుతోంది. ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం మేయర్ పదవి తమకే ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అంటున్నారు. కాంగ్రెస్ వర్గాల మధ్య సయోధ్య కుదరకపోతే వివాదం ఎటు దారి తీస్తుందో చెప్పలేని స్థితి నెలకొంది. అయితే సిపియం నాయకుడు బి.వి. రాఘవులు మరో రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునే స్థితిలో ఉండగా మేయర్ పదవిని వామపక్షాలు ఆశించడం సరి కాదని ఆయన వాదిస్తున్నారు.