జమ్మూ కాశ్మీర్లో 500 మందికి పైగా మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో శనివారం సంభవించిన భూకంపానికి మరణించిన వారి సంఖ్య 500 మందికి పైగానే ఉంటారని అంచనా. దాదాపు 800 మంది గాయపడినట్లు అంచనా. జమ్మూ ప్రాంతంలో 90 మంది సైనికులు గాయపడ్డారు. భూకంప తాకిడి ప్రాంతాల్లో ఆదివారంనాడు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ పర్యటించారు. ఆమె వెంట రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఆర్మీ ఛీఫ్ జనరల్ జె.జె. సింగ్ ఉన్నారు. సరిహద్దు ప్రాంతాలైన ఉరి, తంగ్ధార్లలో భూకంప తీవ్రతను పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.
సోనియా గాంధీ బృందానికి ముఖ్యమంత్రి మొహ్మద్ సయాద్ పరిస్థితిని వివరించారు. సీనియర్ సివిల్, మిలటరీ అధికారులకు కూడా పరిస్థితిని సోనియాకు వివరించారు. జమ్మూకాశ్మీర్లోని విద్యాసంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఇటువంటి భూకంపమే జమ్మూ కాశ్మీర్లో 1885లో సంభవించింది. భూకంప బాధితులకు తమ శక్తి మేరకు సహాయం అందిస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు.