ఒంటరిపోరు ఇద్దరికీ నష్టమే: వెంకయ్య
నెల్లూరు: ఒంటరిపోరు వల్లనే మున్సిపల్ ఎన్నికల్లో నష్టపోయామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఒంటరి పోరు వల్ల తెలుగుదేశం పార్టీ, బిజెపిలు రెండూ నష్టపోయాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బిజెపితో పొత్తు వల్లనే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయామనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన అన్నారు. అంతకు ముందు పొత్తుతోనే 36 లోక్సభ సీట్లు రెండు పార్టీలు గెలుచుకున్నాయని, అప్పుడు దూరం కాని మైనారిటీలు ఇప్పుడు దూరమయ్యారనడం వాస్తవం కాదని ఆయన అన్నారు.
బీహార్ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని ఆయన అన్నారు. ఈ విషయమై రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ను కలుస్తామని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి వెళ్తామని ఆయన అన్నారు.