రవీంద్ర భారతి ముందు తల్లిదండ్రుల ధర్నా
హైదరాబాద్: రాష్ట్రంలో సంభవించిన రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యుల మధ్య బుధవారం శాసనసభలో వాగ్వివాదం చెలరేగింది. రాష్ట్రంలో రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం సభ్యుడు డి. నరేంద్ర కుమార్ విమర్శించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులకు, తెలుగుదేశం సభ్యులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఎస్టీ, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపైన కూడా వాగ్వివాదం నడిచింది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నగేష్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ విధానాన్నే అనుసరిస్తోందని ఆయన విమర్శించారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ లోగా వాటిని భర్తీ చేస్తామని మంత్రి రెడ్యా నాయక్ ఇచ్చిన సమాధానంతో నగేష్ సంతృప్తి చెందలేదు. ఈ విషయమై సభా సంఘానికి నివేదించి సాధ్యమైనంత త్వరగా నివేదిక తెప్పించుకుంటామని మంత్రి చెప్పారు.
మద్యం బెల్టు షాపుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిపియం సభ్యుడు నోముల నర్సింహయ్య సభ దృష్టికి తెచ్చారు. బెల్టు షాపులను ఒక పద్ధతి ప్రకారం నిరోధిస్తామని మంత్రి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు.