ముస్లిం రిజర్వేషన్లపై టిడిపి, బిజెపి వాకౌట్ హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారంనాడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లిమ్లకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేయగా, మత ప్రాతిపదికపై రిజర్వేషన్ల కల్పన దేశవిభజనకు దారి తీస్తుందని విమర్శిస్తూ బిజెపి వాకౌట్ చేసింది. మైనారిటీ సంక్షేమంపై శాసనసభలో లఘు చర్చ అనంతరం ప్రభుత్వ సమాధానానికి సంతృప్తి చెందని బిజెపి, టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు.
మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపియం విమర్శించింది. ముస్లింలను కాంగ్రెస్ ఎప్పుడూ ఓటు బ్యాంక్గానే పరిగణించింది తప్ప వారి సంక్షేమం కోసం కృషి చేయలేదని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, నిజానికి ఈ విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం తన తొమ్మిదేళ్ల పాలనలో ముస్లిమ్ల కోసం చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. తాము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పగానే కాంగ్రెస్ ముస్లిమ్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ తాము కల్పించిన రిజర్వేషన్ల నుంచి చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో రిజర్వేషన్ల ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే ముస్లిమ్లకు రిజర్వేషన్లు కల్పించామని ఆయన చెప్పారు.