క్రికెట్: కుంబ్లే సత్తాతో చతికిలబడ్డ శ్రీలంక
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే మరోసారి తన సత్తా చాటాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కుంబ్లే ఆదివారంనాడు నాలుగు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. ఎంతో పటిష్టస్థితికి చేరుకుంటుందనుకున్న శ్రీలంక కుంబ్లే బౌలింగ్తో కుప్పకూలే స్థితికి వచ్చింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్కు రెండు వికెట్లు దక్కాయి. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ను సమం చేయడానికి శ్రీలంక మరో 92 పరుగులు చేయాల్సి ఉంటుంది.
ఆటపట్టు 88 పరుగులకు కుంబ్లే బౌలింగ్లో అవుటయ్యాడు. జయవర్ధనే, ఆటపట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రీలంక ధాటిని అడ్డుకోవడం కష్టమే అనిపించింది. జయవర్ధనే ధాటిగా ఆడుతూ 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుంబ్లే అవుట్ కావడంతో శ్రీలంక పతనం ప్రారంభమైంది. వరుసగా కుంబ్లే మరో మూడు వికెట్లు పడగొట్టాడు. ఆట ముగిసే సమయానికి ముబారక్ పది పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.
అంతకు ముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు అల్ అవుట్ అయింది. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీథరన్ ముందు ఆదివారం ఉదయం భారత బ్యాట్స్మెన్ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. మురళీథరన్ 100 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. 39 పరుగుల వ్యక్తిగత ఓవర్నైట్ స్కోర్తో ఆదివారం బ్యాటింగ్కు దిగిన సౌరవ్ గంగూలీ మరో పరుగు మాత్రమే జోడించి పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత సచిన్, యువరాజ్ ఒక్కొరొక్కరే పెవిలియన్ దారి పట్టారు. శనివారం తన 35 సెంచరీని సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన సచిన్ ఆదివారం నాడు మరో 9 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది.