పఠాన్ ఆల్ రౌండ్ ప్రతిభ: భారత్ 237/5
న్యూఢిల్లీ: ఇర్ఫాన్ పఠాన్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్లో ఆల్ రౌండ్ ప్రతిభను కనబరిచాడు. కొద్దిలో టెస్టుల్లో తొలి సెంచరీని మిస్ అయ్యాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు పడగొట్టిన పఠాన్ భారత్ రెండో ఇన్నింగ్స్లో గంభీర్తో పాటు ఓపెనర్గా దిగి శ్రీలంక భౌలర్లను ధాటిగా ఎదుర్కున్నాడు. అతను 93 పరుగులు చేసి చామిండా వాస్ బౌలింగ్లో అవుటయ్యాడు. సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 22 పరుగులతోనూ, యువరాజ్ సింగ్ 28 పరుగులతోనూ క్రీజ్లో ఉన్నారు.
భారత జట్టు కెప్టెన్, ఇర్ఫాన్ పఠాన్ కలిసి భారత స్కోర్ను పటిష్ట స్థితికి చేర్చారు. ద్రావిడ్ 53 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గంగూలీతో పొత్తు కుదరక రన్ అవుటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 పరుగులు చేయగా, లక్ష్మణ్ 11 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. తొలి ఇన్నింగ్స్లో సున్నాకే అవుటైన గౌతమ్ గంభీర్ రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. కేవలం మూడు పరుగులు చేసి పెవిలియన్కు చేరుకున్నాడు.
అంతకు ముందు 230 పరుగుల వద్ద శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 60 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతతో భారత్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్లో కుంబ్లే ఆరు వికెట్లు తీసుకోగా, పఠాన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. హర్బజన్కు ఒక వికెట్ లభించింది. రెండో ఇన్నింగ్స్లో చామిండా వాస్ రెండు భారత వికెట్లను పడగొట్టగా, మురళీథరన్కు, బండారాకు ఒక్కటేసి వికెట్లు లభించాయి.