బిసి పథకాలపై శాసనసభలో వాగ్వివాదం
హైదరాబాద్: వెనకబడిన తరగతుల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై మంగళవారం శాసనసభలో అధికార కాంగ్రెస్, ప్రతినక్ష తెలుగుదేశం సభ్యుల మధ్య స్వల్వ వాగ్వివాదం చెలరేగింది. బిసిలకు ఉపకారవేతనాల విడుదలలో, బిసి జనాభాకు అనుగుణంగా పథకాలను చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. బిసిల కోసం ఉన్న పథకాలను అమలు చేయకపోవడంతో వారి మేలు కోసం కొత్త పథకాలను రూపొందించి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.
యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలకు అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చెలరేగింది. బిసిలకు ఎన్.టి. రామారావు ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేశారని, అయితే ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టేసిందని, దానిపై సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు.