రెండో టెస్టు: శ్రీలంకపై గెలుపు దిశగా భారత్
న్యూఢిల్లీ: శ్రీలంకతో ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగిస్తోంది. భారత్ విజయానికి బాటలు వేసుకుంది. భారత లక్ష్యాన్ని ఛేదించే విషయంలో రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక చతికిలపడుతోంది. మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక కేవలం 135 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి జయవర్దనే 9 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.
భారత లక్ష్యాన్ని ఛేదించడానికి శ్రీలంక మరో 305 పరుగులు చేయాల్సి వుంటుంది. అయితే పరుగుల మాట అటుంచి వికెట్లను కాపాడుకుంటూ డ్రా చేసే స్థితిలో కూడా శ్రీలంక లేదు. నిలకడగా ఆడుతున్న కెప్టెన్ ఆటపట్టు, సంగరక్క వికెట్లు పోవడంతో శ్రీలంక ఓటమి దాదాపుగా ఖాయమైంది. తొమ్మిది పరుగులకే ఇర్ఫాన్ పఠాన్ మొదటి వికెట్ను తీశాడు. ఆ తర్వాత సంగరక్క, ఆటపట్టు నిలకడగా ఆడుతూ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. ఆటపట్టు 68 పరుగులు చేయగా, సంగరక్క 33 పరుగులు చేశాడు. వీరిద్దరి వికెట్లు కోల్పోయిన తర్వాత శ్రీలంక వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. కుంబ్లే రెండు వికెట్లు తీసుకోగా, పఠాన్, అగార్కర్, హర్బజన్ ఒక్కటేసి వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ను ఆరు వికెట్ల నష్టానికి 375 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అప్పటికి యువరాజ్ సింగ్ 77 పరుగులతోనూ, మహేంద్ర సింగ్ ధోనీ 51 పరుగులతో నాటవుట్గా ఉన్నారు. యువరాజ్, ధోనీ ధాటిగా ఆడుతూ పరుగుల పంట పండించారు. ధోనీ చాలా వేగంగా తన అర్థ సెంచరీ పూర్తి చేశాడు. మొదటి ఇన్నింగ్ 60 పరుగుల ఆధిక్యతతో కలుపుకొని భారత్ శ్రీలంక ముందు 438 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 237 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో మంగళవారం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ గంగూలీ వికెట్ను మాత్రమే కోల్పోయింది. గంగూలీ 39 పరుగులు చేశాడు.